2దినవృత్తాంతములు 30
మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.
సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా
రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవ నెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.
ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూలమాయెను.
కావున బహుకాలమునుండి వారు వ్రాయబడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయము చేసిరి.
కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలు దేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరు రాజులచేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.
తమ పితరుల దేవుడైన యెహోవా యెడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదొ మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.
మీ పితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధ పరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి.
మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరుల యెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగివచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములు గలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్నుడగును.
అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి.
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.
కావున రెండవ నెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరి.
వారు దాని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి.
రెండవ నెల పదునాల్గవ దినమున వారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొనివచ్చిరి.
దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి.
సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకులుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.
ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి.
యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.
యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱలనిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు
సమాజపు వారందరును చూచినప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచన చేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.
అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలు దేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి.
యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.
అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.