సంఖ్యాకాండము 1
వారు ఐగుప్తు దేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవ నెల మొదటి తేదిని, సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను
ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.
ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమ తమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.
మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతో కూడ ఉండవలెను.
మీతో కూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;
షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు
యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను
ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు
జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు
బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను
దాను గోత్రములో ఆమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు
ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు
గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలాసాపు
నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.
పేళ్లచేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవ నెల మొదటి తేదిని సర్వ సమాజమును కూర్చెను.
ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశావళులనుబట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.
ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు నలుబది యారువేల ఐదు వందలమంది యైరి.
షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు
మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
గాదు గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరు వందలమంది యైరి.
ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగు వందలమంది యైరి.
జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది యేడువేల నాలుగు వందలమంది యైరి.
యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదు వందలమంది యైరి.
మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
మనష్షే గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండు వందలమంది యైరి.
బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగు వందలమంది యైరి.
దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
దాను గోత్రములో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడు వందలమంది యైరి.
ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
ఆషేరు గోత్రములో లెక్కింపబడినవారు నలువది యొకవేయి ఐదు వందలమంది యైరి.
నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
నఫ్తాలి గోత్రములో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగు వందలమంది యైరి.
వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు.
అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీయులందరు
లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.
అయితే లేవీయులు తమ పితరుల గోత్రముచొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.
ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు.
ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.
నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.
మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్ష నొందును.
ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను.
ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినవాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.