1సమూయేలు 14
ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను.
సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది.
షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదు యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.
యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదాని పేరు సెనే.
ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపు వైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపు వైపునను ఉండెను.
యోనాతాను ఈ సున్నతిలేని వారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా
అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టానుసారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.
అప్పుడు యోనాతాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము.
వారు మనలను చూచి మేము మీయొద్దకు వచ్చువరకు అక్కడ నిలువుడని చెప్పినయెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.
మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవా వారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా
వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండు కాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు చూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు
యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయులచేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి
అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను.
యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువది మంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.
దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలు యొక్క వేగులవారికి కనబడగా
సౌలు మీరు లెక్కపెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్కచూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.
దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.
సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి
తానును తనయొద్దనున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి.
మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలో నుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.
అదియు గాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలికనొందిరి.
నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనక మునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.
జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.
జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.
అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.
జనులలో ఒకడు నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.
అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి
జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.
ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి.
జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున
జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి
మీరు అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమ తమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధించిరి.
మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.
అంతట మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువాడొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవుని యొద్ద విచారణ చేయుదము రండని చెప్పి
సౌలు ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.
అందువలన సౌలు జనులలో పెద్దలు నాయొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.
నా కుమారుడైన యోనాతానువలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.
మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.
అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి.
నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను నా చేతికఱ్ఱ కొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.
అందుకు సౌలు యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొననియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికిని కూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను; యెహోవా జీవము తోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.
అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.
ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీయులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.
మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారిచేతిలోనుండి వారిని విడిపించెను.
సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు.
సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.
సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు.
సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలుల నందరిని తనయొద్దకు చేర్చుకొనెను.