నేను మరల తేరిచూడగా రెండు పర్వతముల మధ్యనుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను, ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై యుండెను.
2
మొదటి రథమునకు ఎఱ్ఱని గుఱ్ఱములు, రెండవ రథమునకు నల్లని గుఱ్ఱములు,
3
మూడవ రథమునకు తెల్లని గుఱ్ఱములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలుగల బలమైన గుఱ్ఱములుండెను.
4
నా యేలినవాడా, యివేమిటియని నాతో మాటలాడుచున్న దూతను నేనడుగగా
5
అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.
6
నల్లని గుఱ్ఱములున్న రథము ఉత్తర దేశములోనికి పోవునది; తెల్లని గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవును, చుక్కలు చుక్కలుగల గుఱ్ఱములుగల రథము దక్షిణ దేశములోనికి పోవును.
7
బలమైన గుఱ్ఱములు బయలువెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా, పోయి లోకమందంతట సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతట సంచరించుచుండెను.
8
అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవువాటిని చూడుము; అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను.
9
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా
10
చెరపట్టబడిన వారిలో బబులోనునుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికి పోయి
11
వారినడిగి వెండి బంగారములను తీసికొని కిరీటము చేసి ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద ఉంచి
12
అతనితో ఇట్లనుము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును.
13
అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును,సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును.
14
ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి, హేలెమునకును టోబీయాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును.
15
దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీయొద్దకు పంపెనని మీరు తెలిసికొందురు; మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినయెడల ఈలాగు జరుగును.