1దినవృత్తాంతములు 12
దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి యింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి.
వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైనవారు.
వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ,
ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,
ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా,
కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,
గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.
మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.
వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,
నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,
ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,
ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు,
పదియవవాడు యిర్మీయా, పదకొండవవాడు మక్బన్నయి.
గాదీయులగు వీరు సైన్యమునకు అధిపతులై యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడు నూరుమందికి అధిపతి, అత్యధికుడైనవాడు వెయ్యిమందికి అధిపతి,
యొర్దాను గట్టులమీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులోయలలోను పడమటిలోయలలోను ఉన్న వారినందరిని తరిమివేసినవారు వీరే.
మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగియున్న స్థలమునకు వచ్చిరి.
దావీదు బయలుదేరి వారికి ఎదురుగాపోయి వారితో ఇట్లనెను మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నాయొద్దకు వచ్చియున్నయెడల నా హృదయము మీతో అతికియుండును; అట్లుగాక నావలన మీకు అపకారమేదియు కలుగలేదని యెరిగియుండియు, నన్ను నా శత్రువులచేతికి అప్పగింపవలెనని మీరు వచ్చియున్నయెడల మన పితరులయొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించును గాక.
అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.
సౌలుమీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడ దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి; దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను, ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని యెంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి.
అంతట అతడు సిక్లగునకు తిరిగిపోవుచుండగా మనష్షే సంబంధులైన అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపువారికి అధిపతులు అతని పక్షము చేరిరి.
వారందరును పరాక్రమశాలులును సైన్యాధిపతులునై యుండిరి; ఆ దండును హతముచేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి.
దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చుచుండిరి.
యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా
యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.
షిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు ఏడువేల నూరుమంది.
లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.
అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.
పరాక్రమశాలియైన సాదోకు అను యౌవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.
తమ పితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.
మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.
ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.
జెబూలూనీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.
నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.
దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.
ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.
మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.
ఇశ్రాయేలులో కడమ వారందరును ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.
వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి.
ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.