1దినవృత్తాంతములు 15
దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.
మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.
అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.
అహరోను సంతతివారిని
లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,
మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,
గెర్షోను సంతతివారి కధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,
ఎలీషాపాను సంతతివారి కధిపతియగు షెమయాను వాని బంధువులలో రెండువందల మందిని,
హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబది మందిని
ఉజ్జీయేలు సంతతివారి కధిపతియగు అమ్మినాదాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.
అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై యున్నారు.
ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవాయొద్ద విధినిబట్టి విచారణ చేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.
అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.
తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తికొనిరి.
అంతట దావీదు మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.
కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,
వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయశేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహులనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకులనుగా నియమించిరి.
పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.
జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.
మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.
లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.
బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను
షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టు వారుగాను నియమింపబడిరి.
దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.
యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.
దావీదును మందసమును మోయు లేవీయులందరును పాటకులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొనియుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.
ఇశ్రాయేలీయులందరును ఆర్బాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.
యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.