2రాజులు 13
యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.
ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారికప్పగించెను.
అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.
కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొని మునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.
అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.
రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనము చేసియుండెను.
యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని నంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.
యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను.
ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
యెహోయాషు తన పితరులతో కూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధియందు పాతిపెట్టబడెను.
అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతనియొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.
అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.
నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి
తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి,
బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.
అందు నిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి నీవు అయిదు మారులైన ఆరు మారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.
తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు
కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లుమోపి నిలిచెను.
యెహోయాహాజు దినములన్నియు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.
గాని యెహోవా వారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టకయుండెను.
సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.
అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసికొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.