2రాజులు 23
అప్పుడు రాజు యూదా పెద్దలనందరిని యెరూషలేము పెద్దలనందరిని తనయొద్దకు పిలువనంపించి
యూదావారినందరిని యెరూషలేము కాపురస్థులనందరిని, యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరిని పిలుచుకొని, యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరకిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించెను.
రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.
రాజు బయలు దేవతకును అషేరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటి యెహోవా ఆలయములోనుండి ఇవతలకు తీసికొని రావలెనని ప్రధానయాజకుడైన హిల్కీయాకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి, బూడిదెను బేతేలు ఊరికి పంపివేసెను.
మరియు యూదా పట్టణములయందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టునున్న చోట్లలోను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి, బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి, అతడు అందరిని నిలిపివేసెను.
యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను.
మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.
యూదా పట్టణములోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమ పార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నత స్థలములను పడగొట్టించెను.
అయినప్పటికి ఆ ఉన్నత స్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూషలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు.
మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను.
ఇదియుగాక అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంటపములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను.
మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగది పైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను.
యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి
ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నర శల్యములతో నింపెను.
బేతేలులోనున్న బలిపీఠమును ఉన్నత స్థలమును, అనగా ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీఠమును అతడు పడగొట్టించి, ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేసెను.
యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముమీద కాల్చి దాని అపవిత్రపరచెను.
అంతట అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపువారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధియని చెప్పిరి.
అందుకతడు దానిని తప్పించుడి, యెవడును అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి.
మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములన్నిటిని యోషీయా తీసివేసి, తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను.
అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులనందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నర శల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను.
అంతట రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా
ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినములనుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజులయొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడును జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను.
ఈ పండుగ రాజైన యోషీయా యేలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను.
మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహ దేవతలను విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.
అతనికి పూర్వమున్న రాజులలో అతనివలె పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను పూర్ణబలముతోను యెహోవావైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రముచొప్పున చేసినవాడు ఒకడును లేడు; అతని తరువాతనైనను అతనివంటివాడు ఒకడును లేడు.
అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమునుబట్టి ఆయన కోపాగ్ని యింకను చల్లారకుండ యూదామీద మండుచునే యుండెను.
కాబట్టి యెహోవా నేను ఇశ్రాయేలువారిని వెళ్లగొట్టినట్లు యూదావారిని నా సముఖమునకు దూరముగా చేసి, నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును, నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించెదనని అనుకొనియుండెను.
యోషీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
అతని సేవకులు అతని శవమును రథముమీద ఉంచి, మెగిద్దోనుండి యెరూషలేమునకు తీసికొనివచ్చి అతని సమాధియందు పాతిపెట్టిరి. అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును తీసికొని అతనికి పట్టాభిషేకముచేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగానుంచిరి.
యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తెయగు హమూటలు.
ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండ ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతనిని బంధకములలో ఉంచి, దేశముమీద ఏబది మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి
యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారుపేరుపెట్టి యెహోయాహాజు ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను.
యెహోయాకీము ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పున దేశముమీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచువచ్చెను. దేశపు జనులయొద్దనుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలుచేసి అతడు ఫరోనెకోకు చెల్లించెను.
యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను. అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తెయగు జెబూదా.
ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను.