అపోస్తలులకార్యములు 22
సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై యుండి
ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.
ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారినికూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.
నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.
నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
అప్పుడు నేను ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.
ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.
అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి
సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టిపొంది అతని చూచితిని.
అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు;
నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.
గనుక నీవు తడవుచేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.
అంతట నేను యెరూషలేమునకు తిరిగివచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.
అప్పుడాయన నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.
అందుకు నేను ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.
మరియు నీ సాక్షియైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.
అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పడు ఇటువంటివాడు బ్రదుక తగడు, భూమిమీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.
వారు కేకలువేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా
వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞాపించెను.
వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.
శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీయుడు సుమీ అనెను.
అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా
అతడు అవునని చెప్పెను. సహస్రాధిపతి నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించుకొంటిననెను; అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.
కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను.
మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసికొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.