అపోస్తలులకార్యములు 3
పగలు మూడుగంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.
పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా
పేతురును యోహానును వానిని తేరిచూచి మాతట్టు చూడుమనిరి.
వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
అంతట పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవుగాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను; నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి
వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగినదానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.
వాడు పేతురును యోహానును పట్టుకొనియుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.
పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మాసొంత శక్తిచేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?
అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యెదుట ఆయనను నిరాకరించితిరి
మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకు మేము సాక్షులము.
ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.
సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.
ప్రభువు సముఖమునుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును
మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.
మోషే యిట్లనెను ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.
ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.
మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.
ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు.
దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.