ఆదికాండము 32
యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి
మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;
నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీ జనమును కలరు; నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.
ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగివచ్చి మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా
యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి
ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను
అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నాచేతికఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
నా సహోదరుడైన ఏశావుచేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను.
నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.
అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను
అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱలను ఇరువది పొట్టేళ్లను
ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా
తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల
నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను.
అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు
మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను.
అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.
ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను.
యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను.
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.
తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.
అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయననీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను.
యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను.
అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడగూటిమీద నున్న తుంటినరము తినరు.