ఆదికాండము 42
ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితిమనిరి.
యోసేపు తన సహోదరులను గురుతుపట్టెను గాని వారతని గురుతు పట్టలేదు.
యోసేపు వారినిగూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలిసికొన వచ్చితిరని వారితోననగా
వారు లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితివిు;
మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.
అయితే అతడు లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.
అందుకు వారు నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములో నున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లెడు అని ఉత్తరమిచ్చిరి
అయితే యోసేపు మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.
దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.
మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడియుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి
వారిని మూడు దినములు చెరసాలలో వేయించెను.
మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.
మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.
మీ తమ్ముని నాయొద్దకు తీసికొనిరండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.
అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరునియెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి
మరియు రూబేను ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తర మిచ్చెను.
అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.
అతడు వారియొద్దనుండి అవతలకుపోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.
మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణము కొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.
వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.
అయితే వారు దిగినచోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను.
అప్పుడతడు నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి
వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియచేసిరి.
ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.
అప్పుడు మేము యథార్థ వంతులము, వేగులవారము కాము.
పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితివిు.
అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీనివలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి
నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.
వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.
అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను
అందుకు రూబేను నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నాచేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను
అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను